మర్డర్: స్పందన… ప్రతిస్పందన!

-

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన హత్య ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్టు సంచలన దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ గతంలోనే ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీన్ని పరువు హత్య అని కొందరు.. కుల అహంకారం అని మరికొందరు.. పిచ్చి పీక్స్ ఆలోచన అని ఇంకొందరు.. ప్రేమకున్న విలువ, పవర్ తెలియని మూర్ఖపు చర్య అని చాలా కొందరు చెప్పిన సంగతి తెలిసిందే. ఫాదర్స్ ‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ‌లుక్ ‌ను విడుదల చేశాడు రామ్ ‌గోపాల్ వర్మ. మారుతీరావు, అమృత, ప్రణయ్ నిజజీవిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలిపాడు. ఈ సినిమాకు “మర్డర్” అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.

ఈ ప్రకటనపై అమృత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపన్యాసాలిచ్చే దర్శకుడికి, మాకథ తెరకెక్కించబోయే ముందు మా అనుమతి తీసుకోవాలని తెలియదా? నా జీవితానికీ, ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఓ కట్టుకథకు మా పేర్లు పెట్టుకుని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ పని వల్ల ఆయనకు పబ్లిసిటీ వచ్చుంటుంది. నా భర్త హత్య జరిగినప్పటి నుంచి చాలా ఒత్తిడి మధ్య భావోద్వేగ జీవితం గడుపుతున్నాను. మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలిపడుతున్నా అంటూ రామ్ ‌గోపాల్ వర్మపై అమృత విరుచుకుపడింది.

మా కథ చెప్పబోయే ముందు మా అనుమతి తీసుకోవాలని తెలియదా అంటూనే ఆ సినిమాకి తన జీవితానికీ ఏమీ సంబందం లేదని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. ఆమె వ్యాఖ్యలు అలా ఉంటే… తాజాగా ఈ వ్యాఖ్యలపై వర్మ ట్విటర్ లో ప్రతిస్పందించారు. మొదట నేను ఓ విషయం స్పష్టం చేయదలచుకున్నాను.. మర్డర్ సినిమా నిజజీవితకథ ఆధారంగా తెరకెక్కుతోందని చెప్పాను కానీ, నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. ఈ మర్డర్‌పై చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉండి ఉండొచ్చు. కానీ, నా అభిప్రాయం ఏమిటనేది నా సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.

ముందుగానే ఆ సినిమాలోని కథ గురించి వ్యాఖ్యానించడం అవివేకం. అలాగే ఈ సినిమాలో కొందరిని చెడ్డవారిగా చూపించబోతున్నానని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు.. పరిస్థితులు మాత్రమే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా ఇంకెవరైనా సరే.. వేదన అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. వారు ఎదుర్కొన్న పరిస్థితులనే మర్డర్‌ సినిమాలో చూపించబోతున్నానని వర్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news