రోడ్డుపై వెళ్తున్న వాహనంపై కూలిన చెట్టు.. ఇద్దరు దుర్మరణం

-

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటి వర్షాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది. జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షానికి నిర్మల్‌ జిల్లాలో ఇద్దరు యువకులు బలయ్యారు. టాటాఏస్‌ వాహనంలో వెళ్తుండగా.. ఒక్కసారిగా భారీ వృక్షం వాహనంపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు కుంటాల జలపాతం వద్దకు వెళ్తుండగా.. ఖానాపూర్‌ మండలం ఎగ్బాల్‌పూర్‌ సమీపంలోకి రాగానే భారీ వృక్షం ఒక్కసారిగా వాహనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బుచ్చన్న, రవి అక్కడికక్కడే మృతిచెందారు. నిఖిల్​ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

నిఖిల్‌ను తొలుత ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. గత రాత్రి నుంచి నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news