లోక్‌సభలో నేటి నుంచే అవిశ్వాసంపై చర్చ

-

ఇప్పటికే మణిపుర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దద్దరిల్లుతున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి ఉభయ సభల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్​డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చ ప్రారంభం కానుంది. మణిపుర్ హింసపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది.

అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం రోజున పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆయనే ఇవాళ ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు. బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.

అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news