ఇరాన్‌ నూతన అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను అభినందించిన ప్రధాని మోడీ

-

ఇరాన్‌ నూతన అధ్యక్షుడు  మసూద్‌ పెజెష్కియాన్‌  ను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. ‘ఇరాన్‌ అధక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న మసూద్‌ పెజెష్కియాన్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని మోదీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడం కోసం ఇరాన్‌ నూతన అధ్యక్షుడితో కలిసి పనిచేస్తామని మోదీ తన పోస్టులో రాశారు.

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాది అయిన మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై గెలిచారు. లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో పెజెష్కియాన్‌కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా ఓట్లు ( 53.3 శాతం) రాగా.. జలీలీకి 1.3 కోట్లకుపైగా ఓట్లు ( 44.3 శాతం) ఓట్లు వచ్చాయి.

ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థినే అధ్యక్షుడిగా నియమిస్తారు. అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్‌ఆఫ్‌ పోలింగ్‌ నిర్వహించాలి. జూన్ 28న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. దాదాపు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news