SLBC ప్రమాదం జరిగితే.. ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లావ్ ? అంటూ నిలదీశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…. నేను కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లి ఫంక్షన్ కి అబుదాబికి వెళ్ళాను కానీ కొందరిలా క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళలేదన్నారు. నేను అబుదాబికి వెళ్ళింది ఫిబ్రవరి 21వ తేదీన అయితే ప్రమాదం జరిగింది ఫిబ్రవరి 22వ తేదీ… ప్రమాదం జరిగాక రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడని చురలకు అంటించారు.

ప్రమాద స్థలానికి వెళ్ళడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట పోకుండా హైదరాబాద్ లో ఉన్నాడని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను నిర్మాణాత్మకంగా బాధ్యతా యుతంగా వ్యవహరించి, ప్రమాద సహాయక చర్యలకు కావలసిన సమయమిచ్చిన తర్వాత ప్రమాద స్థలం దగ్గరికి పోయానని వివరించారు. రేవంత్ రెడ్డి తాను రాకపోగా వెళ్లిన నన్ను అడుగడుగున అడ్డుకొని, ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రమాద ఘటన స్థలం నుండే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడిచిన కార్మికులను కాపాడకపోగా, కనీసం వారి మృతదేహాలను బయటకు తీయలేని చేతగాని ప్రభుత్వం… మానవత్వం మరిచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి పోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటాడని నిలదీశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.