నిన్న మొన్నటి వరకు చెదురు మొదురు వర్షాలతో ఊపిరి తీసుకున్న ప్రజలకు ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం చూపించనుంది. రాబోయే 3 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేసారు.
పగటి సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్నీ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్స్ జారీ చేశారు. రాత్రి పూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.