జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దుర్ఘటనలో గాయపడిన వారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా నిలిచింది. ఈ దాడిలో గాయపడిన వారికి ముంబైలోని తమ సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.
ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, “ఈ ఉగ్రదాడి మానవాళికే ఒక మాయని మచ్చ. ఇది ఏ రూపంలో ఉన్నా క్షమించరానిది. ప్రాణాలు కోల్పోయిన వారికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశం కోసం అంబానీ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఈ మేరకు బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను ఉచితంగా అందిస్తుందని ఆయన తెలిపారు.