జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక పౌరులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో దేశ రాజకీయ వర్గాలన్నీ భద్రతా అంశంపై ఒక్కటై చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నేడు (గురువారం) న్యూ ఢిల్లీలో ఒక అత్యంత కీలకమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. దేశ భద్రతకు సంబంధించి ఈ సున్నితమైన అంశంపై చర్చించేందుకు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, విపక్షాల తరఫున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏర్పడిన భద్రతా పరిస్థితిని సమీక్షించడం. భవిష్యత్తులో ఇటువంటి దాడులు మరలా జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా ఉగ్రదాడి జరిగిన తీరును వివరాయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ చర్యలను సమావేశంలో పాల్గొన్న నేతలకు తెలిపారు. దేశ భద్రత విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటిగా ఉండాలని సమావేశం సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ సమావేశం దాదాపు రెండు గంటలు జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రదాడులను అఖిలపక్ష పార్టీలు ఖండించాయి. ఈ సందర్బంగా ” ఎలాంటి చర్యకైనా మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని రాహుల్ గాంధీ కేంద్రానికి మద్దతు తెలిపారు. ఇక రేపు (శుక్రవారం) కాశ్మీర్ లో పర్యటించనున్నారు.