గోవా గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ కి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రమాణం చేశారు. ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతి రాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఏపీ
మంత్రులు నారా లోకేశ్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవాళ అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన అర్దాంగి సునీలా గజపతి రాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మరో కుమార్తె విద్యావతి దేవి నిన్న రాత్రే గోవాకు చేరుకున్నారు. అశోక్ జగపతి రాజు కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు టీడీపీ నేతలు కూడా ముందుగానే అక్కడికి చేరుకోవడం విశేషం.