క్రికెట్ మైదానంలో మైక్ పట్టిన తొలి మహిళ.. చరిత్ర సృష్టించిన ఆమె కథ తెలుసా?

-

క్రికెట్‌ను కేవలం పురుషుల క్రీడగా చూసే కాలంలో ధైర్యంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన వ్యక్తి చంద్ర నాయుడు. భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు కుమార్తెగా ఆమెకు క్రికెట్‌ అంటే కేవలం వారసత్వం కాదు ఆమె ఆత్మ. మహిళా కామెంటేటర్లకు ఆమే తొలి మార్గదర్శి, ఒక మహిళగా కామెంటరీ బాక్స్‌లోకి అడుగుపెట్టి, తన స్ఫష్టమైన వాక్పటిమతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆమె గురించి, ఆమె సాహసం గురించి తెలుసుకుందాం.

సాహసంతో కూడిన ప్రయాణం: తొలి భారతీయ మహిళా కామెంటేటర్, చంద్ర నాయుడు 1970వ దశకంలో క్రికెట్ కామెంటరీలోకి ప్రవేశించారు. ఆ రోజుల్లో క్రికెట్ వ్యాఖ్యానం పూర్తిగా పురుషుల ఆధిపత్యంలో ఉండేది. అలాంటి వాతావరణంలో, ఆమె తన తండ్రి (సీకే నాయుడు) నుంచి వారసత్వంగా పొందిన క్రీడా జ్ఞానంతో మరియు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఆమెకున్న అపారమైన వాక్పటిమతో మైక్ అందుకున్నారు.

1977లో MCC వర్సెస్ బాంబే మ్యాచ్‌తో ఆమె తన కామెంటరీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆకాశవాణి (AIR) ద్వారా ఆమె స్వరం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చేరుకుంది. పురుషులు మాత్రమే ఆధిపత్యం చెలాయించే రంగంలోకి ఆమె అడుగుపెట్టడం అప్పట్లో ఒక సాహసోపేతమైన చర్యగా గుర్తింపు పొందింది.

The First Woman to Hold the Mic on a Cricket Field – Her Inspiring Story!
The First Woman to Hold the Mic on a Cricket Field – Her Inspiring Story!

ఒక ప్రొఫెసర్, ఒక క్రికెటర్, ఒక మార్గదర్శి: చంద్ర నాయుడు కేవలం వ్యాఖ్యాత మాత్రమే కాదు. ఆమె ఇండోర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు మరియు 1950లలో క్రికెట్‌ కూడా ఆడారు. ఆమెకు క్రీడపై ఉన్న ప్రేమ, నిబద్ధత కారణంగానే ఆమె కామెంటరీ బాక్స్‌లో రాణించగలిగారు. అంతేకాక, ఆమె మహిళా క్రీడాకారులను కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 1980వ దశకంలో తన తల్లి జ్ఞాపకార్థం ఒక ట్రోఫీని విరాళంగా ఇచ్చి, మహిళల ఇంటర్-యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించడంలో ముఖ్య పాత్ర వహించారు.

ఆమె జీవితం ఎంతో మంది మహిళలకు క్రికెట్ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తిగా నిలిచింది. చంద్ర నాయుడు, తన తండ్రి గొప్పదనాన్ని స్మరించుకుంటూ ‘C.K. నాయుడు ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం క్రికెట్ చరిత్రలో ఆమె తండ్రి పోషించిన పాత్రను, ఆమె కుటుంబ క్రికెట్ నేపథ్యాన్ని వివరిస్తుంది.

సృష్టించిన చరిత్రకు సజీవ సాక్ష్యం: చంద్ర నాయుడు తన కామెంటరీ వృత్తి ద్వారా దేశంలో మహిళా క్రీడా పాత్రికేయానికి ఒక కొత్త తలుపు తెరిచారు. ఆమె సృష్టించిన ఈ చరిత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆమె చూపిన మార్గంలోనే నేడు ఎంతో మంది మహిళా వ్యాఖ్యాతలు క్రికెట్ ప్రపంచంలో తమ ముద్ర వేస్తున్నారు. క్రికెట్ మైదానంలో మహిళా శక్తిని నిరూపించిన ఈ దిగ్గజ క్రీడాకారిణి కథ నిజంగా అద్భుతం.

Read more RELATED
Recommended to you

Latest news