మనం రోజుకు కనీసం ఒక్కసారైనా అన్నం తినకుండా ఉండలేం. కానీ, బజారుకు వెళ్తే రకరకాల బియ్యం కనిపిస్తాయి. తెల్లటి పాలిష్ బియ్యం చూడటానికి బాగున్నా, ఆరోగ్యం విషయంలో మాత్రం అవి అట్టడుగున ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ షుగర్, బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టకుండా ఉండాలంటే మనం తినే బియ్యం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అసలు ఏ బియ్యం మన శరీరానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తెల్ల బియ్యం (White Rice): చూడటానికి చందమామ కానీ,మనం రోజూ తినే పాలిష్ పట్టిన బియ్యం ఇవే. వీటిలో పీచు పదార్థం (Fiber) దాదాపు సున్నా. ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మేలు. కేవలం రుచి కోసం తప్ప, ఆరోగ్యానికి దీనివల్ల పెద్దగా లాభం లేదు.
దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ (Brown Rice): బియ్యం మీద పొట్టు మాత్రమే తీసి, తవుడును అలాగే ఉంచుతారు. ఇందులో విటమిన్ B, మెగ్నీషియం, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది, త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది వరం.

నల్ల బియ్యం (Black Rice): రాజుల ఆహారంఇది పూర్వం చైనాలో రాజులు మాత్రమే తినే ఈ నల్ల బియ్యంలో ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అత్యధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. శరీరంలోని మలినాలను బయటకు పంపి, వయసు పెరిగినా చర్మం ముడతలు పడకుండా చూస్తాయి.
ఎర్ర బియ్యం (Red Rice): రక్తహీనతకు చెక్, ఈ బియ్యంలో ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత (Anemia) ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఎముకల పుష్టికి, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి ఎర్ర బియ్యం బాగా పనిచేస్తాయి.
ఆరోగ్యపరంగా చూస్తే నల్ల బియ్యం, ఎర్ర బియ్యం మొదటి స్థానంలో నిలుస్తాయి. అయితే రోజువారీ అలవాటు ప్రకారం దంపుడు బియ్యం (Brown Rice) వాడటం ఉత్తమం. తెల్ల బియ్యం వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి, వీటిని ప్రయత్నించండి. తిండి మార్చుకుంటే సగం రోగాలు మాయమవుతాయి.
గమనిక: హఠాత్తుగా బియ్యం రకాన్ని మార్చినప్పుడు జీర్ణక్రియలో చిన్నపాటి మార్పులు రావచ్చు. కాబట్టి, కొద్దికొద్దిగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతోనే బ్రౌన్ రైస్ తీసుకోవాలి.
