హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత గుర్తొస్తుందో, కొండపై వెలిసిన ఆ పాలరాతి కోవెల ‘బిర్లా మందిర్’ కూడా అంతే గుర్తొస్తుంది. నగరం నడిబొడ్డున కోలాహలం మధ్య ఉన్నా, ఈ గుడిలోకి అడుగుపెడితే కలిగే ప్రశాంతతే వేరు. దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం వెనుక ఉన్న విశేషాలు, ఆ నిర్మాణం వెనుక ఉన్న కష్టం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అచ్చంగా భూలోక వైకుంఠాన్ని తలపించే ఈ మందిరం గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం..
కాలాపహాడ్ కొండపై శ్వేతవర్ణ శోభ: ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘కాలాపహాడ్’ అని పిలిచేవారు. ఆ నల్లని కొండపై స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో మందిరాన్ని నిర్మించడం ఒక అద్భుతం. సుమారు 2000 టన్నుల రాజస్థానీ మకరానా పాలరాతిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. 1966లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి కావడానికి పదేళ్లు పట్టింది. 1976లో స్వామివారు కొలువుదీరారు. అప్పటి నుండి నేటి వరకు ఏమాత్రం మెరుపు తగ్గకుండా నగరం నడిబొడ్డున ఒక కిరీటంలా ఈ మందిరం వెలిగిపోతోంది.
శిల్పకళా వైభవం – మూడు సంప్రదాయాల :ఈ ఆలయం కేవలం ఒక శైలికి పరిమితం కాలేదు. దీని గోపురం రాజస్థానీ శైలిలో ఉంటే, ఇతర భాగాలు ద్రవిడ మరియు ఉత్కళ (ఒడిశా) నిర్మాణ శైలుల్లో ఉంటాయి. ప్రధాన గర్భాలయంలో పది అడుగుల ఎత్తులో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం అచ్చం తిరుమల శ్రీవారిని తలపిస్తుంది. విగ్రహం చుట్టూ ఉండే శిల్పకళ, గాలిగోపురాలు మన ప్రాచీన సంస్కృతికి అద్దం పడతాయి. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే, భక్తులు ఏకాగ్రతతో ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఇక్కడ గంటలు ఉండవు.

ఆహ్లాదకరమైన వాతావరణం.. అద్భుతమైన వ్యూ!: నౌబత్ పహాడ్ పక్కనే ఉన్న ఈ కొండపై నుండి చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం ఒక పెయింటింగ్ లా కనిపిస్తుంది. ఒకవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు సెక్రటేరియట్ చుట్టూ మెరిసిపోయే నగర కాంతులు, సాయంత్రం వేళ బిర్లా మందిర్ నుండి చూసే దృశ్యం మాటలకు అందదు. భక్తితో పాటు మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారింది. పక్షుల కిలకిలరావాలు చల్లని గాలి మధ్య స్వామి దర్శనం చేసుకోవడం ఒక మధురమైన అనుభవం.
కులమతాలకు అతీతమైన క్షేత్రం: బిర్లా మందిర్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి భేదభావాలు లేవు. ప్రతి ఒక్కరికీ ఆహ్వానం ఉంటుంది. స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. అలాగే శివుడు, శక్తి, వినాయకుడు, హనుమంతుడి ఉపాలయాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఆధునికతను సంప్రదాయాన్ని మేళవించి నిర్మించిన ఈ ఆలయం.. 50 ఏళ్లుగా భాగ్యనగరానికి రక్షణ కవచంలా ఆరాధ్య దైవంగా నిలిచిపోయింది.
బిర్లా మందిర్ అంటే కేవలం ఒక కట్టడం కాదు, అది కోట్లాది మంది భక్తుల నమ్మకం. కాలుష్యం, ట్రాఫిక్ తో విసిగిపోయిన నగరవాసికి సేదతీరడానికి దొరికే ఏకైక ఆధ్యాత్మిక వనం ఇది. మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, లేదా ఇక్కడే ఉన్నా.. ఒక్కసారైనా ఆ పాలరాతి మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోండి.. ఆ ప్రశాంతతే వేరు!
