- 204 దేశాల కరెన్సీ, రాచముద్రలు, స్టాంపులు కూడా
- 30 ఏళ్లుగా సేకరిస్తోన్న ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి
- ఎక్స్పో ప్రారంభించిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ అభిలాష్
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని తడికలపూడి కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 2026 సైన్స్ ఎక్స్పో గ్రాండ్గా నిర్వహించారు. ఏపీ హైకోర్టు అడ్వకేట్ తారక్ అభిలాష్ సైన్స్ ఎక్స్పో ప్రారంభించగా… తడికలపూడి ఎస్సై కె. చెన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 275 మంది విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఎక్స్పోలో ప్రదర్శించారు. పర్యావరణం, వ్వయసాయం, ఇరిగేషన్, మొబైల్స్ ప్రభావం, జంక్ఫుడ్స్ దుష్పలితాలతో పాటు సైన్స్కు సంబంధించి పదుల సంఖ్యలో ప్రాజెక్టులు ప్రదర్శించారు. 150కు పైగా టేబుల్స్పై ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ఆకర్షించాయి. స్కూల్ ప్రిన్సిపాల్ ఏఎస్డబ్ల్యూ మూర్తి గత కొన్నేళ్ల నుంచి సేకరిస్తోన్న వివిధ దేశాలకు చెందిన నాణేలు, స్టాంపులు ప్రదర్శించారు.

మొత్తం 204 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలు 100 కోట్ల డాలర్ల విలువైనవి ప్రదర్శనకు ఉంచారు. సీతారామ పట్టాభిషేకం కాలంలో తానీషా కాలంలో వాడిన 450 ఏళ్ల నాటి పంచలోహ నాణేలు, గుప్తులు, చోళులు, కాకతీయుల కాలంలో వాడిన కరెన్సీ నాణేలు, రాచముద్రలు, రిజర్వ్ బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి ప్రతి యేడాది విడుదలయ్యే రూపాయి, రు. 2 నాణేలతో పాటు అణ, కాడె, బేడా లాంటి పూర్వాకాల కరెన్సీ నాణేలు, వివిధ దేశాలకు చెందిన స్టాంపులు కూడా ప్రదర్శించారు. ఇవన్నీవిద్యార్థులో ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా వీటిని ఎన్నో కష్టాలకోర్చి సేకరించిన ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

విద్యార్థులు చిన్న వయస్సులోనే సైన్స్ గురించి ఎంతో ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను ఎస్సై చెన్నారావు అభినందించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంత దోహదపడతాయని తెలిపారు. స్కూల్ చైర్మన్ కొర్రపాటి సుధాకర్, తడికలపూడి శివాలయం చైర్మన్ మేకా వసంతరావు, స్కూల్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
