రేపు అనగా (మార్చి 3)న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడం వల్ల ‘బ్లడ్ మూన్’ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా గ్రహణ సమయంలో ‘సూతకం’ వల్ల ఆలయాలన్నీ మూసివేయడం హిందూ సంప్రదాయం. కానీ ప్రకృతి నియమాలకు అతీతంగా గ్రహణ ప్రభావం అస్సలు పడని కొన్ని శక్తివంతమైన క్షేత్రాలు మన దేశంలో ఉన్నాయి. ఖగోళ మార్పుల వేళ భక్తుల పాలిట కొంగుబంగారమై నిలిచే ఆ ఆధ్యాత్మిక రహస్యాలేంటో చూద్దాం.
గ్రహణ కాలంలో రాహుకేతువుల ప్రభావం బలంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, తమిళనాడులోని అరుణాచలం వంటి క్షేత్రాల్లో స్వామివారు స్వయంభువులుగా కొలువై ఉండటమే ఇక్కడి ప్రత్యేకత. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు నవగ్రహాలు మరియు నక్షత్రాలతో కూడిన రక్షణ కవచంలో ఉంటారు. అందుకే ఇక్కడ గ్రహణ సమయంలోనూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే రాహుకేతు దోషాల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం కూడా గ్రహణానికి తలవంచదు. కాలానికే అధిపతి అయిన ‘మహాకాళుడిపై’ గ్రహణాల ప్రభావం ఉండదని పండితులు చెబుతారు. అదేవిధంగా ఢిల్లీలోని కల్కాజీ ఆలయం కూడా భక్తుల కోసం తెరిచే ఉంటుంది. కాలచక్రాన్ని శాసించే కల్కా దేవి ముందు గ్రహాల గమనం సామాన్యమైనదని అందుకే గ్రహణ సమయంలోనూ ఇక్కడ పూజలు నిరాటంకంగా సాగుతాయని నమ్ముతారు.
విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇది నీడల ఆట కావొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఇవి మానసిక ధైర్యాన్ని ఇచ్చే శక్తి కేంద్రాలు. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు ప్రబలకుండా ఈ క్షేత్రాలలోని దైవిక శక్తి రక్షణగా నిలుస్తుందని భక్తులు భావిస్తారు. ఈ అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభం కలుగుతుందని విశ్వసించడమే ఈ ఆలయాల విశిష్టత వెనుక ఉన్న అసలు రహస్యం.
