ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఒక కచ్చితమైన అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా RO (రివర్స్ ఓస్మోసిస్) నీటిని తాగడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, కెమికల్స్ దరిచేరవనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే, ఈ నీటి వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు (Minerals) తగ్గిపోతాయనే ఆందోళన కూడా చాలా మందిలో వ్యక్తమవుతోంది. అసలు RO నీళ్లు తాగితే శరీరానికి లాభమా లేక నష్టమా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మన ఇంట్లో RO ప్యూరిఫైయర్ ప్రాముఖ్యత: పూర్వం నీటిని కాచి వడపోసి తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలుష్యం పెరిగిపోవడంతో నీటిలో వైరస్లు, బ్యాక్టీరియాలతో కలిసి వస్తున్నాయి. ఇక వీటిని తొలగించి, తాగడానికి సురక్షితమైన నీటిని అందించడంలో RO టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఫ్రిజ్, గ్యాస్ స్టవ్ లాగే ఇప్పుడు ప్యూరిఫైయర్ కూడా ప్రతి వంటింట్లో ఒక భాగమైపోయింది.
ఖనిజాలు నిజంగానే తగ్గిపోతాయా?: చాలా మందికి ఉండే ప్రధాన సందేహం ఇదే. అవును, RO ఫిల్టర్ నీటిని శుద్ధి చేసే క్రమంలో అందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాలు కూడా తొలగించబడతాయి. అయితే ఇక దీనివల్ల ఆరోగ్యానికి పెద్దగా ముప్పు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మన శరీరానికి కావలసిన మినరల్స్ కేవలం నీటి ద్వారానే కాకుండా, మనం తినే ఆహారం ద్వారానే ఎక్కువగా అందుతాయి.

ఆహారం ద్వారా ఖనిజాల భర్తీ: మనం తీసుకునే రోజువారీ భోజనంలో సమతుల్యత ఉంటే ఖనిజాల లోపం అనేది రాదు. ఉదాహరణకు, పాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం పప్పు వంటివి తింటే కాల్షియం పుష్కలంగా అందుతుంది. అలాగే అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు పొటాషియంను అందిస్తాయి. ఇక ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఆహారాల వల్ల మెగ్నీషియం లభిస్తుంది. కాబట్టి మనం మంచి పోషకాహారం తీసుకున్నంత కాలం RO నీటి వల్ల ఖనిజాల కొరత రాదు.
కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం: RO నీళ్లు తాగితే కిడ్నీలు దెబ్బతింటాయనేది కేవలం అపోహ మాత్రమేనని నెఫ్రాలజిస్టులు (కిడ్నీ నిపుణులు) స్పష్టం చేస్తున్నారు. మన శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కిడ్నీలు, హార్మోన్లు చాలా సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ఇక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో శుభ్రమైన RO నీటిని తాగడం వల్ల కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.
కొత్త టెక్నాలజీతో మళ్ళీ ఖనిజాలు: ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే ఆధునిక ప్యూరిఫైయర్లు ‘రీమినరలైజేషన్’ ఫీచర్తో వస్తున్నాయి. అంటే ఇవి నీటిని శుద్ధి చేసిన తర్వాత, అందులో శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియంలను తిరిగి చేరుస్తాయి. దీనివల్ల నీటి రుచి పెరగడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ఈ ఫీచర్ ఉండేలా చూసుకోవడం మంచిది.
ఇక కలుషిత నీరు తాగి రోగాల బారిన పడటం కంటే, శుభ్రమైన RO నీటిని తాగడం ఎంతో ఉత్తమం. ఖనిజాల గురించి ఆందోళన చెందకుండా, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అలాగే మీ వాటర్ ప్యూరిఫైయర్ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం మర్చిపోకండి.
గమనిక: పైన అందించిన సమాచారం నిపుణుల అభిప్రాయాలు మరియు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
