వేసవి కాలం మొదలైందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల శరీరం త్వరగా అలసిపోవడమే కాకుండా, లోపలి వేడి కూడా పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో మనం ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ జోలికి వెళ్తుంటాం. కానీ, మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన మూలికలతోనే బాడీని ఏసీలా చల్లబరచుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. మన వంటింట్లో దొరికే ఆ అద్భుతమైన హెర్బల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
పుదీనా కషాయం: వేసవిలో పుదీనా ఆకులతో చేసిన కషాయం తాగడం వల్ల శరీరం తక్షణమే చల్లబడుతుంది. ఇది కేవలం బాడీని కూల్ చేయడమే కాకుండా, మీజిల్స్ వంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇక పుదీనా కుటుంబానికే చెందిన నిమ్మకాయ ఔషధతైలం (లెమన్ బామ్) పానీయాలు కూడా వేడి వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తాయి.
మందార టీ: వేసవిలో మందార పువ్వులతో చేసిన టీ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇది బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఇక ఎర్రటి మందార టీ చూడటానికే కాదు, తాగడానికి కూడా ఎంతో రుచిగా ఉండి శరీరానికి అమృతంలా పనిచేస్తుంది.

సోంపు మరియు కొత్తిమీర: మనం భోజనం తర్వాత తినే సోంపు గింజలకు శరీరాన్ని చల్లబరిచే అద్భుత గుణం ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కొత్తిమీరను జ్యూస్ రూపంలో లేదా వంటల్లో తీసుకోవడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది. ఇక గ్యాస్, అజీర్ణం వంటి పొట్ట సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
తులసితో వేసవికి చెక్: తులసి నీరు లేదా తులసి టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎండల తీవ్రతను తట్టుకునే శక్తి లభిస్తుంది. ఇక తులసిలో ఉండే ఔషధ గుణాలు బాడీని లోపలి నుండి శుద్ధి చేసి, వేడి వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తాయి.
ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ పానీయాలు వేసవిలో మనకు శ్రీరామరక్ష. కృత్రిమ పానీయాల కంటే ఇలాంటి హెర్బల్ డ్రింక్స్ను అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఎండల బారి నుండి కూడా సురక్షితంగా ఉండవచ్చు. ఈ వేసవిలో మీరు కూడా వీటిని ట్రై చేయండి!
గమనిక: హెర్బల్ పానీయాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు ఈ పానీయాలను రెగ్యులర్గా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
