వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

-

మనం రోజూ వాడే వంట నూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. నూనె ప్యాకెట్ల సైజులు, బరువుల పేరుతో వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్న కంపెనీల ఆటలకు కేంద్రం చెక్ పెట్టింది. ఇకపై మార్కెట్లో వంట నూనెలను ఇష్టమొచ్చిన పరిమాణాల్లో ప్యాక్ చేసి అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అసలు కేంద్రం తెచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటో, వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.

కంపెనీలు చేస్తున్న కిలాడీ మోసం ఏంటి?: గత కొన్నేళ్లుగా ఆయిల్ కంపెనీలు ఒక తెలివైన వ్యూహాన్ని ఫాలో అవుతున్నాయి. నూనె ధరలను పెంచితే జనాలు కొనరని, ధర పెంచకుండా ప్యాకెట్ సైజును తగ్గించేస్తున్నాయి. అంటే ఒక కిలో లేదా ఒక లీటర్ ప్యాకెట్ లాగే కనిపించేలా చేసి, అందులో కేవలం 800 గ్రాములు లేదా 900 గ్రాముల నూనెను మాత్రమే నింపుతున్నారు. ఇక కస్టమర్లు అది చూసి ఒక కిలో అనుకుని మోసపోతున్నారు. తక్కువ నూనెకు ఎక్కువ ధర చెల్లిస్తూ నష్టపోతున్నారు. ఈ దోపిడీని అరికట్టడానికే కేంద్రం రంగంలోకి దిగింది.

Centre Introduces New Rules for Edible Oil Packaging
Centre Introduces New Rules for Edible Oil Packaging

ఇకపై కేవలం 9 రకాల ప్యాకెట్లు మాత్రమే: ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం 9 రకాల నిర్దిష్ట పరిమాణాలను (ఫిక్స్‌డ్ సైజులు) ప్రకటించింది. ఇకపై మార్కెట్లో వంట నూనెలు కేవలం 200గ్రా, 500గ్రా, 1కిలో, 2కిలోలు, 3కిలోలు, 4కిలోలు, 5కిలోలు, 15కిలోలు, 20కిలోల ప్యాకెట్లలో మాత్రమే దొరుకుతాయి. ఇక పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరుశెనగ, సోయాబీన్, ఆవ నూనె, నువ్వుల నూనెతో పాటు అన్ని రకాల మిశ్రమ వంట నూనెలకు ఈ రూల్ వర్తిస్తుంది. దీనివల్ల కస్టమర్లు వేర్వేరు బ్రాండ్ల ధరలను ఈజీగా పోల్చి చూసుకోవచ్చు.

ప్యాకెట్‌పై బరువు ముద్రించడం పక్కా: కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు తమ ఆయిల్ ప్యాకెట్లపై లీటర్లు లేదా మిల్లీలీటర్లలో పరిమాణాన్ని రాస్తే, దానికి సమానమైన బరువును గ్రాముల్లో లేదా కిలోగ్రాముల్లో కూడా చాలా స్పష్టంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇక ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయడానికి తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చింది. ఈ లోపు అందరూ కొత్త స్టాండర్డ్స్ మార్చుకోవాలి. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) కూడా స్వాగతించింది.

ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య వినియోగదారుడికి పెద్ద ఊరట లభించనుంది. బరువుల్లో కంపెనీలు చేసే మాయాజాలానికి ఇకపై బ్రేక్ పడనుంది. మనం పెట్టే ప్రతి రూపాయికి సరైన పరిమాణంలో వస్తువు లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news