వయసు పైబడిన వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం (షుగర్) ఒకటి. చాలామంది కేవలం స్వీట్లు తినడం వల్లే షుగర్ వస్తుందని లేదా పెరుగుతుందని అనుకుంటారు. కానీ, వయసు పెరిగే కొద్దీ మానసిక ఒత్తిడి (స్ట్రెస్), మనం తినే ఆహారం కలిసి శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రెండింటికీ మన రక్తంలోని షుగర్ స్థాయిలకు మధ్య ఉన్న షాకింగ్ లింక్ ఏంటో ఇప్పుడు సులభంగా అర్థం చేసుకుందాం.
ఒత్తిడి గురైనప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది?: పెద్ద వయసులో పిల్లల గురించిన ఆలోచనలు, ఆరోగ్య సమస్యలు లేదా ఒంటరితనం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక మనం ఒత్తిడికి లేదా ఆందోళనకు గురైనప్పుడు మన శరీరంలో కార్టిసాల్,అడ్రినాలిన్ అనే స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి నేరుగా షుగర్ లెవల్స్ను ప్రభావితం చేస్తాయి.
అమాంతం పెరిగే గ్లూకోజ్ స్థాయిలు: శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో అత్యవసర పరిస్థితి వచ్చిందని భ్రమపడుతుంది. ఆ సమయంలో శరీరానికి ఎక్కువ శక్తిని ఇవ్వడం కోసం, ఈ స్ట్రెస్ హార్మోన్లు కాలేయం (లివర్) లో దాగి ఉన్న గ్లూకోజ్ను ఒక్కసారిగా రక్తంలోకి విడుదల చేస్తాయి. ఇక దీనివల్ల మనం ఏమీ తినకపోయినా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.

ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు: మానసిక ఆందోళన వల్ల శరీరంలో ‘ఇన్సులిన్ నిరోధకత’ ఏర్పడుతుంది. అంటే, రక్తంలో పెరిగిన షుగర్ను నియంత్రించాల్సిన ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేయదు. ఫలితంగా షుగర్ లెవల్స్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటూ, మధుమేహం నియంత్రణ తప్పిపోతుంది.
ఆహారం, షుగర్ మధ్య ఉన్న అసలు లింక్: మనం తినే ఆహారంలో ఉండే పిండి పదార్థాలు, చక్కెరలు నేరుగా రక్తంలోని గ్లూకోజ్ పై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నం, తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే, అవి వెంటనే జీర్ణమై రక్తంలో షుగర్ లెవల్స్ను రాకెట్లా పెంచేస్తాయి.
షుగర్ను అదుపులో ఉంచుకోవడం ఎలా?: పెద్ద వయసు వారు షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు. మొలకెత్తిన గింజలు, పప్పుల వంటి ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇక ఇవి రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా నిదానంగా విడుదలయ్యేలా చేస్తాయి.
వయసు పైబడిన వారు షుగర్ను అదుపులో ఉంచుకోవాలంటే కేవలం మందులు వాడితే సరిపోదు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవాలి, అలాగే తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అప్పుడే షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుంది.
గమనిక: మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కాసేపు ధ్యానం లేదా తేలికపాటి నడక అలవాటు చేసుకోండి. అలాగే మీ ఆహార నియమాల్లో ఏవైనా పెద్ద మార్పులు చేసే ముందు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది.
