వినాయక చవితి పండుగ వచ్చినా లేదా నిత్య పూజలోనైనా బొజ్జ గణపయ్యను రకరకాల పువ్వులతో అలంకరిస్తుంటాం. అయితే జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం స్వామివారికి కొన్ని ప్రత్యేకమైన పూలు, పత్రాలు అంటే ఎనలేని ప్రీతి. వీటిని పూజలో ఉపయోగిస్తే సకల విఘ్నాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. గణనాథునికి అత్యంత ఇష్టమైన ఆ 3 ముఖ్యమైన పుష్పాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎర్ర మందార: చక్ర సిద్ధాంత రహస్యం: గణపతికి ఎరుపు రంగు అంటే మహా ఇష్టం. యోగశాస్త్రం ప్రకారం గణపయ్య శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి. ఈ చక్రం ఎరుపు రంగు శక్తితో ముడిపడి ఉంటుంది. ఎర్ర మందారను సమర్పించడం వల్ల మూలాధార చక్రం ఉత్తేజితమై మనస్సులో స్థిరత్వం, బుద్ధి, ఏకాగ్రత సులభంగా లభిస్తాయి.
పంచభూతాల సమర్పణకు ప్రతీక: నాటు ఎర్ర మందార పువ్వులో ఉండే ఐదు రేకులు సృష్టికి మూలమైన పృథ్వి, ఆపః, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలకు సంకేతం. ఇక ఈ పువ్వును స్వామికి సమర్పించడం అంటే సమస్త ప్రకృతిని భగవంతుని పాదాల చెంత త్యాగం చేయడమే అని పండితులు చెబుతారు.

గరిక సమర్పణ: సకల విఘ్నాల నివారణ: పుష్పాల కంటే కూడా గణపతికి ‘గరిక’ అంటే ప్రాణం. మూడు లేదా ఐదు ఆకులు కలిపి ఉన్న 21 గరికల కట్టలతో స్వామివారిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా చిటికెలో తొలగిపోతాయి. ఇక ఇది భక్తుల ఆత్మ సమర్పణకు, స్వామివారి అనుగ్రహానికి మధ్య వారధిగా పనిచేస్తుంది.
తెల్ల జిల్లేడు: ప్రతికూల శక్తుల నాశనం: తెల్ల జిల్లేడు చెట్టును వినాయక స్వరూపంగా భావిస్తారు. జిల్లేడు పూల మాలలు లేదా ఆకులతో పూజించడం వల్ల ఇంట్లోని నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. ఇక మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.
కాబట్టి ఈసారి వినాయక పూజలో కేవలం అలంకరణకే పరిమితం కాకుండా.. ఎర్ర మందార, గరిక, తెల్ల జిల్లేడు పూలను భక్తిశ్రద్ధలతో సమర్పించండి. స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలో విజయాలను సాధించండి.
గమనిక: ఇది ఆధ్యాత్మిక గ్రంథాలు, సంప్రదాయ విశ్వాసాలు మరియు పురాణాల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ప్రాధానం.
