పంచాక్షరీ.. పరమ ఔషధం!

-

పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం. పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ శివ పంచాక్షరీ మంత్రం. ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం. కేవలం కోరిన కోర్కిలు తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని ఇచ్చే మహాద్భుత మంత్రం. ఓం ‘నమఃశివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. దీన్ని మన మహర్షులు వేదాలలో భద్రంగా దాచిపెట్టారు. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి అన్నీ లభిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు.

 

మంత్ర విశిష్టత
ఓం నమః శివాయ అనేది పంచాక్షరీమహా మంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. రుద్రంలోని అష్టమానువాకంలో దీన్ని జాగ్రత్తగా భద్రం చేశారని పండితులు చెప్తారు. ఈ మంత్రం అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు. ఓంకారం లేనిదే ఏ మంత్రం పరిపూర్ణ ఫలితాన్నివ్వదు. అందుకే ఏ దేవుడి నామాల అష్టోతరం చదివినా ముందుర ఓం అని చేర్చి చదువుతాం. ఇక పంచాక్షరీలోని అక్షరాల గురించి తెలుసుకుందాం…
‘న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది. ఓం… మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.

నమః శివాయలో పంచభూతాలు!
‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. ‘న’ భూమికి సంబంధించిన భాగాలను, ‘మ’ నీటికి సంబంధించిన భాగాలను, ‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను, ‘వ’ గాలికి సంబంధించిన భాగాలను, ‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. పూర్వం జరిగిన ఒక పురాణ గాథ పరిశీలిస్తే… భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది. శివభక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు.

తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి.. ఓ జనులారా! ఇది ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు. ముని ని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట.

ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.

అదేవిధంగా కార్తీకమాసంలో పంచభూతాత్మికమైన శివక్షేత్రాలను, కనీసం దగ్గర్లోని శివాలయాలను, నదీస్నానం చేసి పంచాక్షరీ జపిస్తూ గడిపితే అధిక ఫలంతోపాటు ఆయుఆరోగ్యాలు లభిస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news