శ్రీకృష్ణ జనన సమయంలో జరిగిన అద్భుతాలు !!

-

గ్రహనక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం … శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు. సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ.

శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ కిరీటంతోనూ, మెడలో కౌస్తుభమణితోనూ, చేతులకు కేయూరాది భూషణాలతోనూ, వక్షస్థలాన శ్రీవత్సం పుట్టుమచ్చతోనూ, పద్మపత్రాలవంటి నేత్రాలతోనూ, వెలుగులు విరజిమ్ముతున్న ముఖబింబంతోనూ, పట్టువస్త్రంతోనూ, సకల జగత్తునూ సమ్మోహింపజేసే నీల మోహనరూపంతోనూ జన్మించిన శిశువును చూసి దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు. ఆ తేజస్సును తట్టుకోలేకపోయారు.

కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని నిల్చున్న వసుదేవునికి అప్పుడు తెలిసింది, తనకి జన్మించింది విష్ణుమూర్తి అని. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. విష్ణుమూర్తికి ప్రణమిల్లాడు. అనేక విధాల స్తోత్రం చేశాడతన్ని. అవతారమూర్తిగా తన కడుపున జన్మించిన విష్ణుమూర్తిని చూసి చేతులు జోడించింది దేవకి. నమస్కరించిందతనికి. అనేక విధాల కీర్తించింది. పూర్వజన్మ సుకృతం కారణంగానే భగవంతుణ్ణి కన గలిగాననుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news