శివరాత్రి : నియమాలు లేకుండా జపించినా సర్వాన్ని ప్రసాదించే శివమంత్రం ఇదే

-

శివం అంటేనే మంగళం. అటువంటి శివుడిని ఆరాధిస్తే సమస్తం వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఆయన ఆయా రూపాల్లో ధ్యానం, జపం, తపం, అభిషేకం చేస్తే ఆయా ఫలాలలను శ్రీఘ్రంగా ఇస్తాడు. ఇక ఒక మంత్రాన్ని ఉపదేశించడానికి లేదా స్మరించడానికి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. మంత్రాల విషయంలో నియమాలను ఉల్లంఘించకూడదని శాస్త్రం చెబుతుంది. ఇటువంటి నియమాలు, విధానాలు అవసరం లేకుండా సిద్ధించే మంత్రం ‘శివాయ గురవే నమః‘. కార్తీకంలో సోమవారం, పౌర్ణిమ, లేదా ఏరోజైనా ఈ మంత్రాన్ని జపించడం, పారాయణం లేదా స్మరించడం ప్రారంభించినా అత్యంత శ్రేష్ఠం.

ఇక ఈ మంత్ర విషయానికి వస్తే ..‘శివాయ గురవే నమః‘ అనే మంత్రానికీ ఏ నియమాలూ అవసరం లేదు. కనుక దీనిని ‘పరమమంత్ర సామ్రాట్‌” అంటారు. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు.

మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రంలో దక్షిణామూర్తులు

ఆయా మంత్రశాస్ర్తాల్లో విస్తారంగా దక్షిణామూర్తి స్వరూపాన్ని వివరించారు. ఆయా రూపాలు వరుసగా….
శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సంబ దక్షిణామూర్తిచహంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తిచకీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తిచశక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లని వాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచిబుద్ధిని ప్రసాదిస్తాడు.

పిల్లలకు చదువు రావాలంటే?

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు. ప్రతీరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే చదువులో బాగా రాణిస్తారు పిల్లలు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news