మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా సీజన్ లో లభించే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, మినరల్స్ వంటి ఎన్నో మంచి పోషకాలు ఉంటాయి. కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే తాజా పండ్ల ను తీసుకోవాలి. వేసవికాలంలో మామిడి పండ్లతో పాటు లీచీ పండ్లు కూడా లభిస్తాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. లీచీ పండ్లు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండి లోపల జెల్లిలా కనిపిస్తాయి మరియు ఎంతో రుచికరంగా ఉంటాయి.
లీచీలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక బి విటమిన్లు, ఫ్లావనోయిడ్స్ అధికంగా ఉండటం తో రక్త కణాల ఉత్పత్తి మెరుగవుతుంది. అంతేకాక మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాల వల్ల నెలసరి సమయం లో సమస్యలతో బాధపడే అమ్మాయిలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా లీచీ పండ్లు సహాయపడతాయి. అయితే, అందరికీ లీచీ పండ్లు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు వీటిని అధికంగా తీసుకోకపోవడం మేలు.
డయాబెటిస్ తో బాధపడేవారు లీచీ పండ్లను అధికంగా తీసుకోవడం మంచిది కాదు. కొంతమందికు లీచీ పండ్లతో అలర్జీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక అటువంటివారు వీటిని తినకపోవడం మేలు. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో లీచీ పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం ఉంది, కనుక పరిమితంగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లీచీ పండ్ల ను తీసుకునే ముందు వైద్యుల సూచనలను పాటించడం అవసరం.