ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చాలా శాతం మంది పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటారు, కాకపోతే సరైన మోతాదులో మంచినీరును తాగరు. దాని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా శరీర పనితీరు ఉండదు. ఎవరి వయస్సు, బరువు ప్రకారం మంచినీరును తీసుకోవాలి. కొంతమంది మంచినీరు తీసుకోవడం వలన ఆరోగ్యకరమని భావించి చాలా ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు, అయితే దాని వలన ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
సహజంగా శరీరంలో సుమారుగా 60 శాతం నీరు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి, హానికరమైన పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి మంచినీరు ఎంతో సహాయం చేస్తుంది. కొంతమంది సరైన విధంగా మంచినీరును తీసుకోకపోవడంతో తలనొప్పి, మూడ్ స్వింగ్స్, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక ఖచ్చితంగా రోజుకు సరైన మోతాదులో మంచినీరు తీసుకోవాలి. 1 నుండి 8 ఏళ్ల పిల్లలకు సుమారుగా 1.3 నుండి 1.7 లీటర్ల వరకు మంచినీరు అవసరం.
దీంతో శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. అలాగే 9 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయస్సు కలిగిన వారికి కనీసం 2 నుండి 2.5 లీటర్ల వరకు మంచినీరు అవసరం. అదేవిధంగా, 18 ఏళ్లు పైబడినవారు మరియు 65 ఏళ్ల వరకు ఉన్నవారు 2.5 నుండి 3 లీటర్ల వరకు మంచినీరును తీసుకోవాలి. ఇలా తాగడం వలన వేడి వాతావరణంలో కూడా హైడ్రేటెడ్గా ఉండవచ్చు. ముఖ్యంగా శరీరంలోని నరాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. కనుక మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, మరియు బరువు ప్రకారం మంచినీరును సరైన విధంగా తీసుకోవాలి. ఇలా సరైన మోతాదులో మంచినీరును తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.