ఉదయం లేవగానే టీలో బిస్కెట్ ముంచుకుని తినడం మనలో చాలామందికి అలవాటు. పిల్లలకైతే స్నాక్స్ అంటే బిస్కెట్లే. మార్కెట్లో డైజెస్టివ్, ఓట్స్, మల్టీగ్రెయిన్ లేదా షుగర్ ఫ్రీ అని రాసి ఉన్న ప్యాకెట్లను చూసి మనం అవి చాలా ఆరోగ్యకరమని నమ్ముతుంటాం. అయితే, ఆ ప్యాకెట్ల వెనుక ఉన్న చిన్న అక్షరాలను ఎప్పుడైనా గమనించారా? మనం హెల్తీ అనుకునే ఆ బిస్కెట్లు నిజంగా సేఫేనా? లేక మనల్ని అనారోగ్యం వైపు నడిపిస్తున్నాయా? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హెల్తీ బిస్కెట్ల వెనుక అసలు కథ: చాలా బిస్కెట్ ప్యాకెట్లపై ‘గోధుమలతో తయారైనవి’ (Whole Wheat) అని పెద్ద అక్షరాలతో ఉంటుంది. మీకు తెలుసా? వాస్తవానికి అందులో గోధుమ పిండి కంటే మైదా పిండే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మైదాను దాచిపెట్టడానికి రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అనే పేరు వాడుతుంటారు. అసలు విషయం ఏమిటంటే, బిస్కెట్లు కరకరలాడటానికి మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటిలో పామాయిల్ లేదా వనస్పతి వంటి ట్రాన్స్ ఫ్యాట్లను విపరీతంగా వాడతారు. ఇవి మన గుండె ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.

చక్కెర లేకపోతే ఆరోగ్యమా?: షుగర్ ఫ్రీ బిస్కెట్లు అంటే మధుమేహం ఉన్నవారు ధైర్యంగా తినేస్తుంటారు. ఇక పోతే, చక్కెర స్థానంలో వారు వాడే ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా, బిస్కెట్లకు ఆ రుచి, రంగు రావడానికి వాడే ప్రిజర్వేటివ్స్, ఎంల్సిఫైయర్స్ వల్ల చిన్నపిల్లల్లో అలర్జీలు, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం ఆరోగ్యకరం అనుకునే ఓట్స్ బిస్కెట్లలో కూడా ఓట్స్ శాతం కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
బిస్కెట్లు పూర్తిగా మానేయడం కష్టమైతే, కొనే ముందు ప్యాకెట్ వెనుక ఉన్న ‘న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్’ గమనించండి. చక్కెర, ఉప్పు మరియు పామాయిల్ తక్కువగా ఉన్నవి ఎంచుకోండి. అయితే, అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. ఇంట్లోనే గోధుమ పిండి, నెయ్యి, బెల్లంతో బిస్కెట్లు తయారు చేసుకోవడం. లేదా బిస్కెట్లకు బదులుగా వేయించిన శనగలు, పల్లీలు, లేదా పండ్లను స్నాక్స్గా తీసుకోవడం చాలా ఉత్తమం.
