హైదరాబాద్‌ బిర్యానీ ఇక్కడిది కాదా..? ఎవరు మొదట తీసుకువచ్చారు..?

-

మధ్య ఆసియాలో బిర్యానీ లాంటి ఓ వంటకాన్ని వండుతారు. దానికి సిండ్రెల్లా ఆఫ్‌ సెంట్రల్‌ ఏషియన్‌ పిలాఫ్‌ అని పేరు. అయితే ఇది పులావ్‌ రుచిని కలిగి ఉంటుందట. ఇదే బిర్యానీలా మారి భారత్‌కు వచ్చిందని కొందరు చెబుతారు.

హైదరాబాద్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే అంశాల్లో.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఒకటి. హైదరాబాద్‌లో ఘుమఘుమలాడే బిర్యానీని అందించే అనేక హోటల్స్‌, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం భాగ్యనగరంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక రకమైన వెరైటీ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు. చికెన్‌, మటన్‌, వెజ్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. ఇలా రక రకాల పదార్థాలకు చెందిన బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ బిర్యానీ కేవలం మనకు హైదరాబాద్‌లోనే కాదు.. ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా ఎక్కడికి వెళ్లినా ల‌భిస్తుంది.  దీంతో ఇప్పుడు హైదరాబాద్‌ బిర్యానీ ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందింది. అయితే అసలు ఈ బిర్యానీ నిజానికి హైదరాబాద్‌లో పుట్టిందేనా..? లేదా దీన్ని ఎవరైనా ఈ నగరానికి తీసుకువచ్చారా ? అసలు హైదరాబాద్‌ బిర్యానీ కథేంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్య ఆసియాలో బిర్యానీ లాంటి ఓ వంటకాన్ని వండుతారు. దానికి సిండ్రెల్లా ఆఫ్‌ సెంట్రల్‌ ఏషియన్‌ పిలాఫ్‌ అని పేరు. అయితే ఇది పులావ్‌ రుచిని కలిగి ఉంటుందట. ఇదే బిర్యానీలా మారి భారత్‌కు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే నిజానికి పులావ్‌ వేరు, బిర్యానీ వేరు. కాగా బిర్యానీ అన్న పదం బిరింజ్‌ బిరియాన్‌ అనే పర్షియన్‌ పదం నుంచి ఉద్భవించింది. అందుకే కొందరు బిర్యానీ ఇరాన్‌లో పుట్టిందని నమ్ముతారు. ఇరాన్‌లో ధమ్‌ బిర్యానీకి ఎంతో చరిత్ర ఉంది. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపై చాలా సేపు ఉడికిస్తారు. అనంతరం దానిపై అన్నం, సుగంధ ద్రవ్యాలు వేసి బిర్యానీ వండుతారు.

అయితే ఇరాన్‌లో ఒకప్పుడు బిర్యానీని బాగా వండినా.. రాను రాను దానికి అక్కడ ప్రాచుర్యం తగ్గడంతో దాన్ని అక్కడ వండడం మానేశారు. అయితే మరోవైపు భారత్‌లో మాత్రం బిర్యానీ దిన దిన ప్రవర్ధమానం అన్నట్లుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని తయారీ విధానంలోనూ ఎన్నో మార్పులు ఇప్పటి వరకు చోటు చేసుకున్నాయి. అయితే మన దేశాన్ని పాలించిన మొఘల్‌ చక్రవర్తులు ఇరాన్‌ నుంచి బిర్యానీని మన దేశానికి తెచ్చారని కొందరు చెబుతారు. కానీ దానికి కూడా ఆధారాలు లేవు. ఇక హైదరాబాద్‌ను పాలించిన నవాబులు ఇరాన్‌ నుంచి బిర్యానీని మన నగరానికి తెచ్చారని చాలా మంది చెబుతారు.

అయితే మొదట్లో నవాబుల కుటుంబాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే బిర్యానీని వండేవారట. కానీ క్రమంగా ప్రజలకు కూడా దాన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు బిర్యానీ తయారీలో అనేక మార్పులు జరిగాయి. బిర్యానీ తయారీలో వాడే సుగంధ ద్రవ్యాల జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. మన దేశంలోని పలు రాష్ట్రాల వాసులు కూడా బిర్యానీని భిన్న రకాలుగా వండుకుని తింటారు. కేరళలో రొయ్యల బిర్యానీ, బెంగాల్‌లో ఢాకాయ్‌ బిర్యానీ చేస్తారు. అవి రుచిలో హైదరాబాద్‌ బిర్యానీని పోలి ఉంటాయి.

ఇక భోపాల్‌లో ఆఫ్ఘాన్‌ బిర్యానీ లభిస్తుంది. అలాగే యూపీలో మొరాదాబాదీ బిర్యానీ ఫేమస్‌ అయితే రాజస్థాన్‌లో అజ్మీరీ బిర్యానీ వండుతారు. ఏది ఏమైనా.. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. బిర్యానీ అంటే ముందుగా హైదరాబాదే గుర్తుకు వస్తుంది. అంతలా మన బిర్యానీ పాపులర్‌ అయింది. అయితే దాన్ని చేయి తిరిగిన వారు వండితేనే ఆ టేస్ట్‌ మనకు తెలుస్తుంది. ఎంతైనా.. అది హైదరాబాదీ బిర్యానీ కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version