బాబు.. సీబీఐ విచారణకు సిద్ధమా?

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మరో లేఖాస్త్రం సంధించారు. ఐదు ప్రశ్నలతో కూడి లేఖాస్త్రంలో… చంద్రబాబు అవినీతి, అప్రజాస్వామిక వ్యవహార శైలి వల్ల ఏపీలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.  భోగాపురం విమానాశ్రయం విషయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకున్న టెండర్ ని రద్దు చేసి ఇతర కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారో వివరించాలని అడిగారు. ఎలాంటి అవినీతి లేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. లోటు బడ్జెట్ రాష్ట్రమంటూ బీద అరుపులు అరుస్తూ కథలు చెబుతున్న సీఎం ప్రజాధనాన్ని ఆర్భాటాలకు దుర్వినియోగం చేయడం లేదా? ఇంత  దుబారా మరేక్కడైనా ఉందా? గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహాణ కోసం ఈవెంట్ సంస్థలకు లక్షల రూపాయలు చెల్లించారు. ప్రభుత్వ ఆడిటోరియాలు ఉన్నా వాటిని నిర్వీర్యం చేయడం తగదన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.11 వేలు వెచ్చించి అమరావతిలో సచివాలయం, అసెంబ్లీలను నిర్మిస్తే అక్కడ వర్షానికి లీకేజీ అవ్వడం మరీ దారుణమన్నారు. ప్రతీ వారం బహిరంగ లేఖను రాస్తున్న కన్నా లక్ష్మీనారాయణ తన 11వ లేఖను నేడు విడుదల చేశారు.

ప్రభుత్వం పై కన్నా సంధించిన ఐదు ప్రశ్నలు..

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ఏర్పాటు చేసిన ఎంతో కీలకమైన ఏపీ నాన్ – రెసిడెంట్ తెలుగు సొసైటీకి భారత పౌరసత్వం లేని వ్యక్తిని సీఈఓగా నియమించవచ్చా?

మీ పాలనలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక దాడులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాన్నారు..కానీ కామాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారా?

భారీ సొమ్ములిచ్చి నిర్మించిన అమరావతి సచివాలయం, అసెంబ్లీలో వర్షానికి లీకులు ఏర్పడితే మీకు సిగ్గుగా లేదా? రాష్ట్రం పరువు నాశనం కాలేదా?

బీద రాష్ట్రామని పలు సార్లు చెప్పుకునే మీరు ప్రజాధనాన్ని మీ ఆర్భాటాలకు దుర్వినియోగం చేయడం లేదా?

భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ల విషయంలో మీరు సీబీఐ విచారణకు సిద్ధమా?

అంటూ వివరిస్తూ .. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news