పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక పరిణామాల నడుమ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజృంభించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ పై పాక్ మళ్లీ దాడులకు తెగబడుతుంటే కూడా ఎన్నో దశాబ్దాలుగా అమలులో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేది. అయితే, పహల్గామ్లో అమాయక పర్యాటకులపై జరిగిన హత్యాకాండ తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. 1960లో నెహ్రూ, ఆయూబ్ ఖాన్ నేతృత్వంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.
ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడి చేయాలన్న ఉద్దేశంతో 15 భారతీయ నగరాలపై క్షిపణి దాడి యత్నించింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ ఈ దాడులను సకాలంలో ఎదుర్కొంది. ఇదే సమయంలో చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్, సలాల్ డ్యామ్ గేట్లను భారత్ కింది స్థాయికి దించడంతో పాక్లో నీటి లభ్యత తగ్గింది. మళ్లీ ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో పాకిస్తాన్లో వరద పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. ఈ ఉత్కంఠభరిత సందర్భంలో అజయ్ బంగా మోదీతో భేటీ కావడం, ప్రపంచస్థాయిలో భారత్ తీసుకుంటున్న ధైర్యవంతమైన నిర్ణయాలపై చర్చకు దారితీసింది. మరోవైపు, ఆయన రేపు ఉత్తర్ ప్రదేశ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. యూపీని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల దృష్ట్యా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.