వేల టన్నుల బరువున్న రైలును, లక్షల మంది ప్రయాణికుల ప్రాణాలను తమ చేతుల్లో పట్టుకుని పట్టాలపై పరుగెత్తించే లోకోపైలట్ల జీవితం బయటకు కనిపించేంత రంగులమయంగా ఏమీ లేదు. ఇటీవల ఏకంగా 72 మంది లోకోపైలట్లు “మాకు రిటైర్మెంట్ ఇచ్చేయండి” అంటూ మొరపెట్టుకోవడం రైల్వే వర్గాల్లో సంచలనం సృష్టించింది. వయసు పూర్తి కాకముందే వారు ఎందుకు ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు? పట్టాల మీద పరుగు వెనుక ఉన్న ఆ పదునైన బాధ ఏంటి? ఆ కథాకమీమామిషూ ఇప్పుడు చూద్దాం.
రిటైర్మెంట్ అనుమతించండి: భారతీయ రైల్వేలో లోకోపైలట్ ఉద్యోగం అంటే అది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక నిరంతర యుద్ధం. తాజాగా విధులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న ఆ 72 మంది లోకోపైలట్ల విజ్ఞప్తి వెనుక ఒక పెను ఆవేదన దాగి ఉంది.
నిద్రలేని రాత్రులు – నిరంతర ఒత్తిడి: రైలు ఇంజిన్ క్యాబిన్లో ఉష్ణోగ్రత వేసవిలో 50 డిగ్రీలు దాటుతుంది. ఆ వేడిలో, కిటికీ గుండా వచ్చే వేగవంతమైన గాలి ఇంజిన్ చేసే భయంకరమైన శబ్దాల మధ్య గంటల తరబడి ఏకాగ్రత చెడకుండా కూర్చోవడం సామాన్యమైన విషయం కాదు. సరిగ్గా తినడానికి సమయం ఉండదు ప్రకృతి పిలుపుని అదుపు చేసుకోవాల్సిన దుస్థితి. ఈ ఒత్తిడి వల్ల వారిలో అధిక రక్తపోటు, మధుమేహం మరియు తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు పెరిగిపోతున్నాయి.

కుటుంబానికి దూరంగా: పండుగలు లేవు, పబ్బాలు లేవు. పిల్లల పుట్టినరోజులు, భార్యాబిడ్డల కష్టసుఖాల్లో పాలుపంచుకోలేనంత బిజీ షెడ్యూల్స్. విధుల్లో చిన్న పొరపాటు జరిగినా లక్షల మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయనే భయం వారిని మానసికంగా కుంగదీస్తోంది “జీతం కంటే జీవితం ముఖ్యం” అనే స్థితికి వారు చేరుకున్నారు. అందుకే ఉన్నత అధికారులకు తమ గోడు వెళ్లబోసుకుంటూ ‘వాలంటరీ రిటైర్మెంట్’ కోరుతున్నారు.
వ్యవస్థలో మార్పు అవసరం: లోకోపైలట్ల కొరత కారణంగా ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. విశ్రాంతి గంటలు తగ్గడం, పని గంటలు పెరగడం వారిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోయేలా చేస్తోంది. ఈ 72 మంది విజ్ఞప్తి కేవలం ఒక వ్యక్తిగత కోరిక కాదు అది మొత్తం రైల్వే వ్యవస్థలో జరగాల్సిన మార్పులకు ఒక హెచ్చరిక.
పట్టాల మీద రైలు పరిగెడుతోంది అంటే దాని వెనుక ఒక లోకోపైలట్ తన కళ్ళను, కాలాన్ని ధారపోస్తున్నాడని మనం గుర్తించాలి.
