ఏపీ క్యాబినెట్ సమావేశం..ముగిసింది. 12 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది ఏపీ మంత్రి వర్గం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ నెల 25 నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నూతన బార్ పాలసీకి ఆమోదం తెలుపగా, నాయి బ్రాహ్మణలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు ఆమోదం తెలిపింది.

ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 ఏపీటీడీసీ హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దుకు నిర్ణయం తీసుకుంది.
పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఐఐసీకి రూ. 7500 కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మావోయిస్ట్ పార్టీ, ఆర్ డీ ఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం విధించింది.