ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని ప్రకటించారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమని.. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి.. ఎక్కువ నిల్వ చేస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వివరించారు.