తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు భగభగ మండుతుంటే.. మరోవైపు అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భిన్న వాతావరణం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం రోజున రాష్ట్రంలో 52 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవాళ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతపురం నాగసముద్రంలో 39.9, కడప అట్లూరులో 39.8, చిత్తూరు నిండ్రలో 39.7, నంద్యాల దొర్నిపాడులో 39.6,
ప్రకాశం గంటుపల్లిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మరోవైపు రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నందున.. తెలంగాణలో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు ఆదిలాబాద్లో గరిష్టంగా 38.3 డిగ్రీలు.. హైదరాబాద్లో 33.8 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.