BREAKING : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. అయిదుగురు సజీవదహనం

-

ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ పయనమవుతున్నారు. అలా ఏపీ నుంచి హైదరాబాద్ బాట పట్టిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌లో మంటలు రేగి అవి బస్సులోకి వ్యాపించాయి.

ఏం జరుగుతుందో అర్థం చేసుకోనేలోపే ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు ఈ సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి.. 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news