ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు విధానాన్ని ఆధునీకరిస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం, ఇకపై రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు తరహాలో జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల్లో QR కోడ్ అమర్చబడి ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా కార్డు హోల్డర్కు సంబంధించిన అన్ని వివరాలు తక్షణమే తెలుసుకోవచ్చు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వారు తమ రేషన్ కార్డులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించనున్నారు. అర్హత కలిగిన నూతన దరఖాస్తుదారులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఇక జూన్ నెలలో కొత్త డిజైన్తో రూపొందించిన రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా, ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు మధ్యాహ్నం వరకు సిద్ధమవుతాయని తెలిపారు. ఈ అంశంపై రేపే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఖచ్చితంగా కొనుగోలు చేస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
అలాగే దీపం 2 పథకం ద్వారా ఇప్పటివరకు 1.50 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.