మోదీ జీ.. మీ ట్రిక్స్ నాకు తెలుసంటూ.. ప్రధాని ప్రసంగంపై గహ్లోత్‌ కామెంట్స్

-

నేను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవరి మాటల వెనక ఏం మర్మముందో గ్రహించగలను. అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ప్రధాని మోదీ తనపై పొగడ్తలు కురిపించడాన్ని ఉద్దేశించి గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే..?

ఇటీవల వందే భారత్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా మాట్లాడారు. దీనిపై గహ్లోత్‌ స్పందిస్తూ.. ‘‘ఆ సందర్భంగా నన్ను ఉద్దేశించి..‘నా స్నేహితుడు గహ్లోత్‌’ అని మోదీ అన్నారు. నా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని వారు అనుకున్నది చేస్తారు. అదొక తెలివి. ఆ మాటల వెనకున్న ట్రిక్స్‌ అర్థమయ్యాయి. నేను కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్నాను. నేను రాజకీయాల్లో సీనియర్‌ను అని ఇదివరకు మోదీ అన్నారు. అలా అయితే.. ప్రధాని నా సలహా తీసుకొని, రాజస్థాన్‌ కోసం మేం తీసుకొచ్చిన ఈ పథకాన్ని  దేశం కోసం అమలు చేయాలి’ అని గహ్లోత్ సూచించారు.

ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘గహ్లోత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ సమయం తీసుకొని రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతున్నా’ అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్‌లు ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారేనని గుర్తుచేసిన మోదీ.. ‘గహ్లోత్‌ జీ.. మీ చేతులో రెండు లడ్డూలున్నాయ్‌’ అంటూ చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news