వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తారు : అచ్చెన్నాయుడు

-

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్వాక్రా గ్రూపులకు చంద్రబాబు రూ. 5 లక్షల వరకూ సున్నా వడ్డీ రాయితీ వర్తింపజేయడంతో మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని అన్నారు. వడ్డీ రాయితీని రూ. 10 లక్షల వరకూ వర్తింపజేస్తానని మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షలు కూడా ఇవ్వకుండా రూ. 3 లక్షలకు కుదించడం మోసకారి సంక్షేమం కాదా? జగన్ రెడ్డీ అని అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్ చేసిన మోసం వల్ల పొదుపు మహిళలకు లబ్ధి రూ. 30 వేలకు తగ్గిపోయిందని అచ్చెన్న దుయ్యబట్టారు. కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆచరణలో జగన్ రెడ్డి మొండిచేయి చూపాడని అన్నారు అచ్చెన్నాయుడు. చేయూత పథకంతో జగన్ రెడ్డి చేతివాటం ప్రదర్శించాడని… పథకం కింద అన్ని కులాలు కలిపి కేవలం 30 లక్షల మందికి మాత్రమే లబ్ధి అంటే మిగిలిన 85 లక్షల మంది సంగతేంటి జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ఖాయమని చెప్పారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version