భారీ మెజారిటీతో గెలువబోతున్నాం.. హుజురాబాద్ ప్రజలకు బండి సంజయ్ ధన్యవాదాలు

-

హజురాబాద్ ఉపఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. పార్టీ శ్రేణుల నుండి అందిన సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందని…భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి అభినందనలు అన్నారు.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని.. ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి న్యాయం వైపు, ఈటల రాజేందర్ గారి వైపు, బిజెపి వైపే నిలిచారని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారని.. టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా.. అధికార యంత్రాంగంతో బిజెపి పై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, మా కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. బిజెపి కార్యకర్తలు ఎక్కడా అదరక, బెదరక పూర్తి సమయమిచ్చి బిజెపి విజయం కోసం కృషి చేశారన్నారు. అందుకు తోడ్పడిన వారందరికీ పేరుపేరునా అభినందనలు, కృతజ్నతలు తెలిపారు బండి సంజయ్.
కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు ఒక మంచి ఆలోచనతో బిజెపి పార్టీని ఆదరించారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version