ఈనెల 27న హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ

-

ఈనెల 27న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్న క్రమంలో బండి సంజయ్ కూడా కరీంనగర్​లో తన నివాసం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తెరాస ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.

“దిల్లీ లిక్కర్​ కుంభకోణం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరలించడానికే నన్ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలంగాణ ప్రజలందరికి అర్థమయింది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించిన తీరుతాం. దాంతో పాటు ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్​ కళాశాల మైదానంలో రెండు గంటలకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తాం.” – బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మరోవైపు హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలోనూ పలువురు ముఖ్యనేతలు నిరసన దీక్షకు దిగారు. ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సినీనటి జీవితా రాజశేఖర్, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆ పార్టీ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన చూసి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడ్డుకునే చర్యలు దిగుతున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version