నిఖిల్ పెళ్లిపై విమర్శలు.. స్పందించిన సీఎం యడియూరప్ప

-

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ వివాహంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వేళ పలువురు పెళ్లిల్లు వాయిదా వేసుకుంటుంటే.. బాధ్యత హోదాల్లో పనిచేసినవారు ఇలా తమ ఇంట్లో పెళ్లి ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ పెళ్లిలో కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదని మండిపడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా ఉందనే వార్తలు వచ్చాయి. తాజాగా నిఖిల్ వివాహంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు.

శనివారం రోజున కరోనా నియంత్రణ చర్యలపై చర్చించిన అనంతరం యడియూరప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు యడియూరప్ప స్పందిస్తూ.. నిఖిల్ పెళ్లి కావాల్సిన అన్ని అనుమతులు వారి కుటుంబ సభ్యులు తీసుకున్నారని తెలిపారు. నిబంధనలకు లోబడి పెళ్లి కూడా చాలా నిరాడంబరంగా జరిపించారని చెప్పారు. నూతన దంపతులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే ఈ పెళ్లికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంపై జేడీఎస్ నేతలు స్పందిస్తూ.. కుమారస్వామి కుటుంబం ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదని అంటున్నారు. కాగా, నిఖిల్-రేవతిల వివాహం శుక్రవారం ఉదయం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగింది. పెళ్లి కుమార్తె రేవతి.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎం క్రిష్ణప్ప సోదరుడు మంజునాథ్‌ మనవరాలు.

Read more RELATED
Recommended to you

Latest news