మోడీ, అమిత్ లకు ’షాక్‘ ..ఊహించని ఫలితాలు

-

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. వన్ సైడ్ ఫలితాలు వస్తాయని వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తారు మారైనాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారం కైవసం చేసుకున్నప్పటికీ హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వా నేనా అన్న రీతిలో ఫైట్ చేసింది. హర్యానాలో 90 సీట్లకు ఎన్నికలు జరిగితే బీజేపీకి 40 సీట్లు రాగా, కాంగ్రెస్ కు 30, చౌతాల మునిమనుమడు దూష్యంత్ పార్టీ జేజేపీ తొలిసారి పోటీ చేసి 10 స్థానాలు కైవసం చేసుకున్నది.

మిగతా సీట్లు ఇతరులకు వచ్చాయి. అధికారం కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 47 సీట్లు అవసరం. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో దుష్యంత్ చౌతాలా కొత్తగా స్థాపించిన పార్టీ జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మరి కొంత కష్టపడితే అధికారం కైవసం చేసుకునే అవకాశాలు ఉండేవి. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఏకంగా చేతులేత్తిసినట్లు వ్యవహరించింది. పైగా ఆ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో విదేశీ పర్యటనలో ఉండడం, ఏదో తప్పని పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కొంత మేరకు ప్రచారం నిర్వహించినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోయారు.

హర్యానాలో స్థానిక నాయకత్వమే చెమటోడ్చిందని చెప్పవచ్చు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సరైనా దిశా నిర్ధేశం లేక ఎన్నికలను ఎదుర్కొన్నది. అయినప్పటికీ మెరుగైన ఫలితాలను సాధించింది. జేజేపీతో కలిసి హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో పడింది. ఇక బీజేపీ పరిస్థితి దారుణంగా దిగజారింది. అధికారంలో ఉన్న హర్యానా రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ సాధించలేక పోయింది. పైగా 7గురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా ఓటమి పాలు కావడంతో బీజేపీపై ప్రజల్లో ఏ మేరకు అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ అధ్యక్షుడు ఓటమి పాలు కావడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ జాతీయ అధ్యక్షుడికి పంపించారు.

మరోవైపు హర్యానా సీఎంను ఢిల్లీకి రావల్సిందిగా అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై చేయాల్సిన వ్యుహంపై చర్చించే అవకాశాలున్నాయి. పైగా జేజేపీ పార్టీ దుష్యంత్ చౌతాలా మద్దతు కోరేందుకు అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ సింగ్ బాదల్ కు అప్పగించారు. దీంతో హర్యానాలో జేజేపీ కింగ్ మేకర్ అయింది. ఈ పార్టీ ఎవరికీ మద్ధతు ఇస్తే ఆ పార్టీ అధికారం కైవసం చేసుకోనున్నది. అంతేకాకుండా జేజేపీ పార్టీకి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసే అవకాశముంది. దీంతో దుష్యంత్ చౌతాలా తీసుకునే నిర్ణయంపై ఆధారపడింది.

మహారాష్ట్రలో బీజేపీకి చావు తప్పి కన్ను లోట్ట పోయిందని చెప్పవచ్చు. బీజేపీ, శివసేన కూటమి అధికారం కైవసం చేసుకున్నది. ఈ కూటమి 160 సీట్లు కైవసం చేసుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ, శివసేన కూటమి చేరుకున్నప్పటికీ బీజేపీలో భయం మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బీజేపీ సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటుందని వెల్లడించాయి. కానీ లెక్క తారుమారు కావడంతో పాటు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆధిత్య ఠాక్రే ముంబాయిలోని వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి తొలిసారిగా అడుగుపెట్టారు. దీంతో ముఖ్యమంత్రి పీఠం చెరి సగం పంచుకోవాలని శివసేన నాయకుడు సంజాయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆధిత్య ఠాక్రే ను సీఎంగా చేయాల్సిందేనని శివసేన పట్టుబట్టే అవకాశముంది. దీంతో బీజేపీ శివసేన రూపంలో గాలం పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ధ్వయం జీర్ణించుకోలేక పోయింది.

మోడీ, అమిత్ షాలు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో హిందూత్వ, 370 ఆర్టికల్ రద్దు, ఉగ్రవాదం వంటి అంశాలను తమ ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రయోగించారు. ప్రతి సమావేశంలోనూ ఈ అంశాలను ప్రధానంగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. తమకు ఎదురే లేదన్న రీతిలో మోడీ, అమిత్ షాలు ప్రచారాన్ని నిర్వహించారు. కానీ ఫలితాలు చూస్తే హిందూత్వ, 370 ఆర్టికల్ రద్దు, ఉగ్రవాదం, పాకిస్థాన్ వంటి పాచికలు పారలేదని అర్థమౌతుంది. కేంద్రంలో అధికారం సాధించిన ఆరు నెలల్లోనే అధికార పార్టీ బీజేపీకి మిశ్రమ ఫలితాలు రావడం జీర్ణించుకోలేకపోతుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు చాలా తెలివిగా ఓటు వేశారని ఫలితాలను బట్టి తెలుస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news