కుప్పకూలిన కరెంట్‌ డిమాండ్‌.. ప్రమాదపుటంచున విద్యుత్‌ గ్రిడ్‌

-

గ‌త మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని భారీ వర్షాలతో తెలంగాణ అత‌లాకుత‌లం అవుతోంది. జోరు వాన‌తో రాష్ట్రంలో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా విద్యుత్‌ డిమాండ్ పతనమై గ్రిడ్‌ ప్రమాదపుటంచుల్లో మిణుకు మిణుకుమంటోంది. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పడిపోయింది. మంగళవారం అర్ధరాత్రి (11.30 గంటలకు) అత్యల్పస్థాయికి పడిపోయి 2,809 మెగావాట్లుగా రికార్డయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత త‌క్కువ విద్యుత్‌ డిమాండ్‌ ఇదే కావడం గమనార్హం. విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పడిపోతున్న ఇలాంటి పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతూకాన్ని పరిరక్షించకపోతే విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌) కుప్పకూలే ప్రమాదముంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

అయితే, డిమాండ్‌ ఎంతగా పడిపోయినా గ్రిడ్‌ను పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. వాస్తవానికి సోమవారం రాత్రి 4,300 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్‌ డిమాండ్‌ మంగళవారం పగటి వేళల్లో 5,803 మెగావాట్లకు పెరిగింది. అయితే, రాత్రి వేళల్లో 3,132 మెగావాట్లకు.. అర్ధరాత్రి మరింత తగ్గి 2,809 మెగావాట్లకు పడిపోయింది. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లేకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు వాడకపోవడంతో డిమాండ్‌ అనూహ్యంగా తగ్గింది. యాసంగి పంటలతో పాటు రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం 12 వేల నుంచి 13 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసుకోగా, నాలుగో వంతుకు డిమాండ్‌ పడిపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news