శాంతించిన గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

-

గోదావరి నది శాంతించింది. వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 12.5 అడుగులు ఉండగా, సాయంత్రం 6 గంటలకు 11.7 అడుగులకు తగ్గింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.

వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నా కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపు నీటిలోనే ఉన్నాయి. ముంపు తొలగిన ప్రాంతాలు, నివాసాల్లో బురద పేరుకుపోవడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపడుతున్నా చాలా ప్రాంతాల్లో వైరల్‌ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు నష్టాలను అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు.

మరోవైపు కృష్ణా నదికి ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం మధ్యాహ్న సమయంలో మొత్తం 70 గేట్లను ఎత్తి సుమారు 73,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భారీ వర్షాలకు మునేరు, పాలేరు ఉగ్రరూపం దాల్చాయి. మూసీ ప్రాజెక్టు నుంచి వరద పులిచింతలలోకి వస్తోంది. ఫలితంగా పులిచింతల ప్రాజెక్టు వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం 10,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద కాస్త తీవ్రత తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news