ఎర్ర సముద్రంలో హౌతీలకు ఎదురుదెబ్బ.. అమెరికా కాల్పుల్లో 10మంది రెబల్స్ మృతి

-

ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ రెబల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెలికాప్టర్లతో అమెరికా జరిపిన కాల్పుల్లో 10 మంది హౌతీ తిరుగుబాటుదారులు మృతి చెందారు. డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్చ్ హంగ్జౌ రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం నాలుగు బోట్లలో నౌక సమీపానికి చేరుకున్నాయి.

అదే సమయంలో మెర్స్ సిబ్బంది పంపిన సందేశాలతో అమెరికా రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు కాల్పులు జరపగా మూడు బోట్లు ధ్వంసం అయ్యాయి. నాలుగో బోటు తప్పించుకొని వెళ్లిపోయింది. కాల్పుల్లో 10 మంది మరణించినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెర్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

దీనిపై అమెరికా స్పందిస్తూ మెర్స్ రవాణా నౌకపై హౌతీలు క్షిపణులను ప్రయోగించగా వాటిని తాము తిప్పికొట్టినట్లు తెలిపింది. మరోవైపు, అమెరికా దాడిపై హౌతీ తీవ్రంగా స్పందిస్తూ ఎర్ర సముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version