ఉన్నత చదువులు, ఉద్యోగం లేదా పర్యటన కోసం బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్. మీపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను యూకే ప్రభుత్వం పెంచింది. ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. యూకే సర్కార్ తాజా ప్రకటనలో విద్యార్థి వీసాలపై భారీగా భారం పడనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆర్థిక కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం వీసా (ఆరు నెలల గడువు) ఫీజు 115 పౌండ్లు ఉండగా.. పది శాతం పెరిగి 127 పౌండ్లకు చేరుకుంది. రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లిస్తున్నారు. అయితే త్వరలో అది 524 పౌండ్లకు చేరనుంది. ఆరు నెలల నుంచి 11 నెలల స్వల్ప కాలపరిమితి ఇంగ్లిష్ కోర్సు చదివే విద్యార్థుల ఫీజు కూడా 14 పౌండ్లు పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది.