‘జీ20 సదస్సుకు వచ్చేదే లేదు’.. తేల్చి చెప్పిన చైనా

-

భారత్‌ పట్ల చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరగనున్న జీ20 సదస్సుకు తాము హాజరుకావడం లేదని తెలిపింది. వివాదాస్పద భూభాగంలో సమావేశాలు జరపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో నిర్వహించే ఇలాంటి భేటీలకు తాము హాజరు కాబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ చెప్పారు. శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు నిర్వహించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. అయితే కశ్మీర్‌పై ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు జీ20 సమావేశాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు శ్రీనగర్‌లోని షేర్‌ ఏ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెషన్‌ సెంటర్‌లో పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ మూడో సదస్సు జరుగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. శ్రీనగర్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version