బాబు మెడ‌పై క‌త్తిపెట్టి… జేసీ శాంపిల్ చూపించారా..?

-

ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తాయి. వైసీపీ ఆవిర్భవించడం, కాంగ్రెస్ కనుమరుగవ్వడం, రాష్ట్రం విడిపోవడం లాంటి అంశాల తర్వాత… ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా పోలిటికల్ యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉన్న సందర్భంలో కాస్త రాజకీయాలు బాగానే నడిచేవి. కానీ టీడీపీతో వైసీపీ తలపడటం మొదలయ్యాక రాజకీయాలు వేరే స్థాయికి మారాయి. 2014లో ఏపీల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చి వన్‌సైడ్ పాలన చేసింది.

వైసీపీని ఎక్కడకిక్కడే తోక్కేసే ప్రయత్నం చేసింది. జగన్‌ని ఎప్పటికప్పుడు అవమానాల పాలు చేస్తూనే వచ్చింది. ఆయన జైలు జీవితం గురించి హేళనగా మాట్లాడారు. అయితే 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది…టీడీపీ నేతలకు చుక్కలు కనబడటం మొదలైంది. గతంలో కంటే రెట్టింపుగా వైసీపీ, టీడీపీని ఓ ఆట ఆడేసుకుంటుంది.

జగన్ ఓ వైపు ప్రజల సంక్షేమం చూసుకుంటూనే, మరోవైపు టీడీపీని పతనం చేసే పనిలో ఉన్నారు. అసలు ప్రభుత్వం మీద ఒక్క విమర్శ చేస్తే ఆ టీడీపీ నేత గానీ, కార్యకర్త పరిస్థితి గానీ మరి ఘోరంగా తయారవుతుంది. అసలు గత టీడీపీ పాలన కంటే ఎక్కువగానే ఇప్పుడు వైసీపీ వన్‌సైడ్ పాలన నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు చంద్రబాబుని మామూలుగా హేళన చేయడం లేదు. ఏడాది కాలంలోనే ఆయనకు చాలా అవమానాలు ఎదురయ్యాయి.

పైగా ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో బూతుల యుద్ధం నడుస్తుంది. మంత్రులే బూతులు మాట్లాడుతూ రాజకీయాలని మరో లెవెల్‌కు తీసుకెళుతున్నారు. అయితే ఇన్ని అవమానాలని ఎదురుకుంటున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. నెక్స్ట్ తమ ప్రభుత్వం వస్తే మరింతగా వైసీపీకి చుక్కలు చూపించాలనే కసితో రగిలిపోతున్నారు. ఇక ఇదే విషయం ఇప్పుడు మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి బయటపడింది.

నెక్స్ట్ మరింత రాక్షసత్వం చూపే ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఎవరిని వదిలిపెట్టమని, చంద్రబాబు మెడ మీద కత్తి పెట్టి మరీ కావాల్సినవని చేయించుకుంటామని జేసీ చెప్పేస్తున్నారు. అంటే అంటే నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం వస్తే వైసీపీ పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఏపీలో ఇక‌పై కక్షపూరిత రాజకీయాలు జోరందుకుంటాయ‌ని మాత్రం అర్ధమవుతుంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version