కమల్ మూవీ షూటింగ్ కు బ్రిటన్ రాణి… ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

-


బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​-2.. విలక్షణ నటుడు కమ్​లహాసన్​​ నటించిన ఓ సినిమా షూటింగ్ లాంఛ్​కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు ఆమె సెట్స్​లోనే గడిపారు. ఇంతకీ అది ఏ సినిమా అంటే?

లోకనాయకుడు కమల్ హాసన్ జీవితంలో మరుపురాని సన్నివేశం చోటు చేసుకుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ ‘మరుదనాయగం’ లాంచింగ్​ ఈవెంట్‌కు బ్రిటన్‌ మహారాణి క్వీన్ ఎలిజబెత్‌-2 హాజరయ్యారు. అవును మీరు చదివింది నిజమే. 1997లో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరైన బ్రిటన్​ రాణి.. సుమారు 20 నిమిషాల పాటు సెట్స్​లోనే గడిపారు. అందుకోసం చిత్రబృందం భారీ ఏర్పాట్లు చేసింది. రూ.1.5 కోట్లతో భారీ యుద్ధ సన్నివేశాన్ని షూట్ చేశారు.

అప్పట్లో ఈ సినిమాకు కమల్ హాసన్ దర్శకత్వం వహించి.. రూ.80 కోట్లతో నిర్మిద్దామని ప్లాన్ చేశారు. మూవీ కథను సిద్ధం చేసేందుకు ఆయన ఆరేళ్లు కష్టపడ్డారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చిన ఓ ఇంటర్నేషనల్ కంపెనీ అనుకోకుండా వెనక్కివెళ్లిపోవడం వల్ల ‘మరుదనాయగం’ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని కమల్ మళ్లీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ మూవీ రిలీజ్ కంప్లీట్ కాకపోయినా.. క్వీన్ ఎలిజబెత్-2 చీఫ్ గెస్ట్‌గా రావడంతో ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

అయితే తాజాగా క్వీన్ ఎలిజబెత్‌-2 మరణం పట్ల కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. “బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్ II మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమెను బ్రిటిష్ వారే కాదు.. యావత్ ప్రపంచం మొత్తం అభిమానించింది. 25 ఏళ్ల క్రితం మా ఆహ్వానాన్ని మన్నించి మరుదనాయగం మూవీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. బహుశా ఆమె హాజరైన ఏకైక సినిమా షూటింగ్ ఇదేనేమో. ఐదేళ్ల క్రితం లండన్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమెను ప్యాలెస్‌లో కలవడం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. తమ ప్రియమైన రాణిని కోల్పోయిన ఇంగ్లాండ్ ప్రజలకు, రాజకుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి..” అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news