ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు

-

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో 31 ఎకరాల భూమికి సరైన నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కృష్ణంరాజు. తన పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాలు ఇతరత్రా వాటి విలువ కలిపి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కృష్ణంరాజు కోరారు. దీంతో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కృష్ణంరాజుతో పాటు సినీ నిర్మాత అశ్వినీ దత్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.

నిజానికి గత ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా అశ్వినిదత్ 40 ఎకరాల భూమిని ఇవ్వగా, కృష్ణం రాజు 31 ఎకరాల భూమిని ఇచ్చారు. కాగా ఆ భూమికి బదులుగా ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో అశ్వినిదత్, కృష్ణంరాజులకి భూమిని కేటాయించింది. అయితే భూసేకరణ చట్టం 2013 ప్రకారం తన 39 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలని అశ్వినిదత్ కోరారు. గన్నవరం వద్ద ఆ భూమి ఎకరం రూ.1.54 కోట్ల మేర విలువ కలిగి ఉందని, ఆ భూమికి సరిసమాన విలువ కలిగిన భూమిని అమరావతిలో ఇస్తామని నాటి సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని అశ్వనీదత్ తన పిటిషన్ లో వివరించారు. ఇప్పుడు రాజధానిని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని చూడడంతో అమరావతిలో ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. పిటిషన్ లో అశ్వనీదత్… ప్రభుత్వాన్ని, ఎయిర్ పోర్టు అథారిటీని ప్రతివాదులుగా చేర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version