39శాతం అభ్యర్థులు కోటీశ్వరులు.. ఆరో విడత ఎన్నికల లెక్క ఇదే

-

సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో పోటీ పడుతున్న 869 మంది అభ్యర్థుల్లో 39 శాతం కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) వెల్లడించింది. మొత్తం 57 స్థానాల్లో 866 మంది అఫిడవిట్లను విశ్లేషించి అందులో 338 మంది కోటీశ్వరులని తేలినట్లు తెలిపింది. ఒక్కో అభ్యర్థి ఆస్తుల విలువ సగటున రూ.6.21 కోట్లుగా ఉందని వారి అఫిడవిట్లను విశ్లేషించింది.

 ప్రధాన పార్టీలపరంగా చూస్తే బీజేడీ నుంచి ఆరుగురు, బీజేపీ 48, ఎస్పీ 11, కాంగ్రెస్‌ 20, టీఎంసీ ఏడుగురు, ఆర్జేడీ, జేడీయూ, ఆప్‌ల నుంచి నలుగురు చొప్పున రూ.కోటికిపైగా ఆస్తులను వెల్లడించారు.  రోహ్‌తక్‌ స్వతంత్ర అభ్యర్థి మాస్టర్ రణ్‌ధీర్ సింగ్ అత్యల్పంగా కేవలం రూ.2 విలువైన ఆస్తులను వెల్లడించగా, ప్రతాప్‌గఢ్‌లోని ఎస్‌యూసీఐ(సీ) అభ్యర్థి రామ్‌కుమార్ యాదవ్ రూ.1,686 విలువైన ఆస్తులను ప్రకటించారు.

హరియాణాలోని కురుక్షేత్ర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నవీన్‌ జిందాల్‌ అత్యధికంగా రూ.1241 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సంతృప్త్‌ మిశ్రా (బీజేడీ, రూ.428 కోట్లు), సుశీల్‌ గుప్తా (ఆప్‌, రూ.169 కోట్లు) రెండో, మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 180 మంది (21 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారని ఏడీఆర్‌ నివేదిక చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news