బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.
బెంగళూరు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సిబ్బంది మంటల్ని గుర్తించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారమిచ్చారు. ఎయిర్పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేయగా.. రాత్రి 11:12 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తూనే సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.
ఎట్టకేలకు రన్వేపై క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికే ఫైరింజన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విచారం వ్యక్తం చేసింది. నియంత్రణా సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని తెలిపింది.